Vizianagaram Sports Camps : వేసవి సెలవులను చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మంచి అడుగు వేసింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సమ్మర్ క్రీడా శిబిరాలను ఏర్పాటు చేసింది. విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఈ శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 క్రీడా శిక్షణా కేంద్రాలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుల్లో శిక్షణ పొందేందుకు సుమారు 1,900 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మే 1వ తేదీన ప్రారంభమైన ఈ క్రీడా శిబిరాలు మే 31వ తేదీ వరకు జరగనున్నాయి. పిల్లలకు అనుకూలంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.ఈ సమ్మర్ క్యాంపులలో విద్యార్థులకు బ్యాడ్మింటన్, బాక్సింగ్, చదరంగం వంటి ఆటలతో పాటు శారీరక వ్యాయామాలు కూడా నేర్పిస్తున్నారు. పిల్లలు మొబైల్స్కు దూరంగా గ్రౌండ్లో ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. ఆటలతో పాటు రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు సైతం విజయనగరం జిల్లా వేదిక కావడం విశేషం. క్రీడల వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Comments