Ten Inscriptions On Second Day : మార్కాపురం జిల్లా నల్లమలలోని పురాతన శిలా శాసనాలను వెలుగులోకి తెచ్చేందుకు పురావస్తుశాఖ చేపట్టిన పరిశోధనలో కొత్త విషయాలు బహిర్గతమయ్యాయి. రెండో రోజైన శుక్రవారం నల్లమల అడవి, సమీప గ్రామాలైన అయ్యంబొట్లపల్లి, చాపలమడుగు, యర్రగొండపాలెంలోని పురాతన చెరువు కట్టపై ఉన్న పది శాసనాలను గుర్తించారు. కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, పొత్తపి చోళుల సామ్రాజ్యాలకు సంబంధించిన రాతి శాసనాలు గుర్తించారు. వీటిలో కల్యాణి చాళుక్యులు కన్నడలో వేసిన శాసనం వెలుగు చూసింది. శ్రీశైలం మల్లికార్జునస్వామి, త్రిపురాంతకం ఆలయానికి భూములు, గ్రామాలు ధారాదత్తం చేసినట్లు లిఖించి ఉందని పురావస్తుశాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి తెలిపారు. మిగతా తొమ్మిది శాసనాలు తెలుగులోనే ఉన్నట్లు పేర్కొన్నారు. కాకతీయ గణపతి దేవుడికి సామంతుడైన గంగయ సాహిని అనే రాజు త్రిపురాంతకం ఆలయానికి భూములు ఇచ్చినట్లు వివరించారు. ఇప్పుడు లభ్యమైనవన్నీ క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 16 శతాబ్దాల మధ్యవిగా ఆయన చెప్పారు. వీటిని మరింత విశ్లేషిస్తామన్నారు.