Tadipatri Brothers Real Stunts : సాహసానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఆ ఇద్దరు చిన్నారులు. తమ అసాధారణ ప్రతిభతో అసాధ్యమైన రికార్డును సుసాధ్యం చేసి చూపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సాహస ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అకాడమీకి చెందిన అన్నదమ్ములు చింత సాయి నర్సింహారెడ్డి, చింత గౌతమ్కుమార్ రెడ్డి చేసిన సాహసాలు స్థానికుల్ని ఆకట్టుకున్నాయి. రోడ్డుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాట్ఫారమ్లపై ఈ ఇద్దరు చిన్నారులు పడుకోగా సాయి నర్సింహారెడ్డి శరీరంపై నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా ఏకంగా వంద కార్లు వెళ్లాయి. గౌతమ్కుమార్ రెడ్డి శరీరంపై నుంచి వంద బైకులు వరుసగా వెళ్లాయి. చిన్నారులు చూపిన ధైర్యసాహసానికి స్థానికులు చప్పట్లతో అభినందనల వర్షం కురిపించారు. ఇప్పటికే తమ ప్రతిభతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డులను వీరు సొంతం చేసుకున్నారు. ఈ చిచ్చర పడుగులు భవిష్యత్లో ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోనూ స్థానం సంపాదించాలని వారి తల్లిదండ్రులు, కోచ్లు ఆకాంక్షిస్తున్నారు.
Comments