Integrated Assisted Living Center In Godumakunta : వృద్ధుల సంరక్షణకు సత్యసాధన ఫౌండేషన్ కృషి చేస్తున్నట్లు ఆ ఫౌండేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ కొమ్మినేని సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ కొమ్మినేని విజయలక్ష్మి తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని కీసర మండలం గోధుమకుంటలో సత్యసాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అసిస్టెంట్ లివింగ్ సెంటర్ భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి, కిమ్స్ ఛైర్మన్, ఎండీ బి.భాస్కర్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యసాధన ఫౌండేషన్, విజయ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ సౌజన్యంతో విజయ హోమ్స్ ఫర్ ఎల్డర్స్ ద్వారా వృద్ధులకు సేవలు అందిస్తున్నారు.ఇప్పటి వరకు 170 మందికి పైగా వృద్ధులకు సేవలు అందించారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 70 మంది వృద్ధులు నివసిస్తూ సేవలు పొందుతున్నారు. వృద్ధుల గౌరవం, భద్రత, జీవన నాణ్యతను పరిరక్షించే వాతావరణాల అవసరం పెరుగుతుందన్నారు. వృద్ధులు గౌరవంతో స్వతంత్రంగా జీవించగలిగేలా సమగ్ర సంరక్షణ సేవలతో కూడిన పోషక వాతావరణాన్ని సృష్టించడం తమ దృక్పథమని నిర్వాహకులు తెలిపారు. జీవితాంతం గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పిస్తూ, ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తయ్యే వరకు సంరక్షణ అందించడం తమ సేవాతత్వమని వివరించారు.
Comments