Stree Ride Project in Talangana : తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమెన్ సేఫ్టీ వింగ్, రాష్ట్ర రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ప్రతిష్టాత్మక 'స్త్రీ రైడ్' ప్రాజెక్ట్ను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. మహిళలు రవాణా, డెలివరీ రంగాల్లో స్వయం ఉపాధి సాధించేలా ప్రోత్సహించేందుకు ఈ-బైక్స్, ఈ-ఆటోలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతలో 55 మంది మహిళలకు స్త్రీ రైడర్లుగా అవకాశం కల్పించారు. వీరికి అంబర్పేట్ పోలీస్ లైన్స్లో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ ఇప్పించి డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. మహిళలకు టూ వీలర్, త్రీ వీలర్ డ్రైవింగ్లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పించారు. నాలుగు నెలల్లో మహిళా రైడర్ల సంఖ్యను మూడింతలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జొమాటో, స్విగ్గీ తరహా డెలివరీ సేవల్లో మహిళల భాగస్వామ్యంపై డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. మహిళలు కొత్త ఉపాధి రంగాల్లో అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటే దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని వ్యక్తం చేశారు.