People Queue up at Fuel Stations : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది. మండలంలోని దాదాపు అన్ని బంకుల్లో కేవలం రెండింట్లో మాత్రమే పెట్రోల్ దొరుకుతుండటంతో ఆ బంకుల వద్ద జనం బారులు తీరారు. అశ్వారావుపేటలోని బంకు వద్ద పెట్రోల్ కోసం జనం ఎగబడటంతో పోలీసులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వినాయకపురంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.పెట్రోల్ దొరకడం లేదని బంకుల్లో జనాలు బాటిళ్లు పట్టుకొని లైన్లో నిలబడ్డారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతుల నేపథ్యంలో వాహనదారులు బారులు తీరారు. వాహనదారులు, రైతులు డీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. గతంలో పెద్ద డ్రమ్ములు తీసుకొచ్చి పెట్రోల్ నింపుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పలు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. దీంతో కొరత తలెత్తగా, వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల్లో ఇంధనం కోసం గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Comments