Priyadarshini Jurala Project : జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాలలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కృష్ణానదిపైనే ఈ ప్రాజెక్టును నిర్మించారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.989 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి జూరాల జలాశయానికి 29,668 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు. 27,210 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. నెట్టెంపాడు, కోయిల్సాగర్ రిజర్వాయర్లకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు జలాశయం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 513.10 అడుగులుతో డెడ్ స్టోరేజ్కు దగ్గరలో ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 136 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
Comments