Golconda Bonalu 2026 : తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మకమైన శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లంగర్హౌస్ నుంచి ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15.05 కోట్లను ఈ ఉత్సవాల కోసం కేటాయించింది. బోనాలను సమర్పించేందుకు వచ్చిన భక్తులతో గోల్కొండ కోట కిటకిటలాడింది. ఈ వేడుకల్లో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు పలువురు ప్రముఖులు జగదాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో ప్రారంభమై లష్కర్ మహంకాళి జాతర, పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాల వరకు సాగే ఈ సంబురం యావత్ తెలంగాణకు ఒక సరికొత్త పండుగ వాతావరణాన్ని, ఉత్తేజాన్ని తీసుకువస్తుంది.
Comments