Theft In Khammam : ఖమ్మంలో భారీ చోరీ చోటు చేసుకుంది. నగరంలోని వైరా రోడ్డులో సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల దుకాణంలో దొంగలు పడ్డారు. షట్టర్లకు వేసిన తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, సుమారు రూ.కోటికి పైగా విలువైన 100కు పైగా సెల్ఫోన్లు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, బుధవారం అర్ధరాత్రి 3:30 సమయంలో కారులో వచ్చిన దొంగలు తాళాలు పగులగొట్టి షట్టర్లు తెరవడంతో విజయవాడ సోనోవిజన్ ప్రధాన కార్యాలయంలో అలారం మోగింది. వారు తమ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది దుకాణం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పని పూర్తి చేసుకున్న దొంగలు తమ కారులో ప్రయాణం అవుతుండగా సిబ్బంది అడ్డగించారు. వారిని తప్పించుకుని దొంగలు వైరా వైపు వేగంగా దూసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలను కట్టదిట్టం చేశారు. అన్ని ఠాణాలను అలర్ట్ చేశారు. దొంగలు పారిపోకుండా జిల్లా పోలీస్ యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. చాలా విలువైన మొబైళ్లను దొంగిలించినట్లు తెలుస్తోంది. దొంగలు అంతర్రాష్ట్ర చోరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments