Devotees Thronged The Venue On The Second Day Of The Rottela Panduga : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది. కోర్కెల రొట్టెల కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రెండో రోజు కూడా భక్తజనం పోటెత్తింది. భక్తులు ఎక్కువగా వస్తుండటంతో దర్గాకి వచ్చే దారులన్నీ రద్దీగా మారాయి. భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటూ బారాషాహీదులను దర్శించుకుంటున్నారు. స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలు మార్చుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. బారాషాహిదులను దర్శించుకుని, స్వర్ణాల చెరువులో రొట్టెలు పంచుకుంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 30 వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. "గత ఏడాది మా కుమారుడి కోసం 'సంతానం' 'ఉద్యోగం' కోరుతూ 'రొట్టె'లను తీసుకున్నాం. ఆ కోరికలు అదే ఏడాదిలో నెరవేరాయి. దానికి కృతజ్ఞతగా, మేము ఈ ఉత్సవానికి తిరిగి వచ్చి 12 రొట్టెలను పంపిణీ చేశాం. అలాగే మా ఇంటి శ్రేయస్సు కోసం 'బర్కత్' (అభివృద్ధి/సమృద్ధి) రొట్టెను కూడా తీసుకున్నాము. మాకు అంతా మంచి జరిగింది" అని ఓ భక్తురాలు చెప్పారు
Comments