Boy Escapes Major Current Poll Accident in Kurnool: కర్నూలు జిల్లాలోని పాఠశాలకు వెళ్తున్న బాలుడికి తృటిలో ప్రమాదం తప్పింది. కరెంటు స్తంభం హఠాత్తుగా పడిపోవడంతో చుట్టు పక్కనున్న స్థానికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో భయంతో బాలుడు ఒక్కసారిగా పరుగులు తీశాడు. దాంతో కరెంటు తీగలు మీద పడకుండా ప్రాణాలతో ఆ పిల్లవాడు సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో తప్పిన పెను ప్రమాదం: కర్నూలు జిల్లాలోని అశోక్ నగర్లో ప్రస్తుతం కాలువల మరమ్మతుల పనులను చేస్తున్నారు. అయితే ఈ కాలువల నిర్వహణ పనుల్లో పడిన అధికారులు విద్యుత్ స్తంభాలను మాత్రం పూర్తిగా గాలికొదిలేశారని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. స్తంభం కూలిపడే సమయంలో గమనించి గట్టిగా అరవడం వలనే బాలుడి ప్రాణాలు నిలిచాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. "ఈరోజు ఉదయం 7:30 గంటలకు కరెంటు తీగల స్తంభం ఒక్కసారిగా కూలిపడింది. అయితే కూలిపడే సమయంలో పాఠశాలలో చదువుకుంటున్న పిల్లవాడు ఆ స్తంభం వైపు నడుచుకుంటూ వచ్చాడు. సరిగ్గా అప్పుడే స్తంభం కూలబోతుంది. దాంతో మేమందరం ఒక్కసారిగా కేకలు వేశాం. దాంతో బాలుడు అప్రమత్తమై పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. ఇటువంటి ఘటనలు మరలా ఎప్పుడూ జరగకుండా స్థానిక అధికారులు శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం". -చంద్రారెడ్డి, అశోక్నగర్
Comments