Snakes At Tuni Railway Station : కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో పాములు హడలెత్తిస్తున్నాయి. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయంతో పాటు ప్లాట్ఫామ్ పై ప్రయాణికులు వేచి ఉండే గదిలోనూ ఇవి సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో దగ్గరలో ఉన్న తుప్పలు, చెట్ల వద్ద ఉన్న పుట్టల్లోంచి ఇవి బయటకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. పాములను చూసిన ప్రయాణికులు కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి కొన్నింటిని పట్టుకున్నారు. స్టేషన్ ప్రాంగణంలో పాత భవనాలు, దశాబ్దాల నాటి అనేక చెట్లు ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసు కోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే ప్రయాణికులను, ప్రమాదవశాత్తు లగేజీ బ్యాగుల్లోకి దూరే అవకాశాలు ఉన్నాయని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అందుకే మళ్లీ ఇలా పాములు ప్రజలు తిరిగే ప్రాంతాల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే స్టేషన్ అధికారులను కోరుతున్నారు.
Comments