Yuga Tulasi Chairman Hunger Strike : గో సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కొలిశెట్టి శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఖైరతాబాద్లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గోవధకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. గోవధ చట్టాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని శివకుమార్ ఆరోపించారు. గోవులను చంపకుండా నిఘా పెంచి, వాటి అక్రమ రవాణాను నిలిపేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గోరక్షకులపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. గోసంరక్షణ కోసం తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని శివకుమార్ వెల్లడించారు.ఇటీవల నగర పరిధిలో గోవుల అక్రమ రవాణా, వధపై వచ్చిన ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కమిషనర్ అనుమతి లేకుండా పశువుల రవాణా, వధించడం వంటి చర్యలు చట్టాన్ని ఉల్లంఘించినట్లేననీ, నిబంధనలను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేయాలని యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ నేడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
Comments