Summer Fog Blankets Paderu Agency : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతం విభిన్న వాతావరణాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇక్కడ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ సందర్శకులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రమంతా వేసవి ఎండలు మొదలయ్యాయి. కానీ పాడేరులో మాత్రం విభిన్న పరిస్థితి కనిపిస్తోంది. వేసవి కాలంలో కూడా ఇక్కడ దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. ఉదయం వేళ ఏజెన్సీలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ఉదయం పూట కూడా లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. దీనికి తోడు ఉదయం వేళల్లో సన్నని మంచు తుంపర్లతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ఇక్కడ 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. గత వారం రోజులుగా పగటిపూట గరిష్ఠంగా 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయినప్పటికీ ఉదయం, రాత్రి వేళల్లో మాత్రం ఏజెన్సీలో ఆహ్లాదకరమైన చలి వాతావరణం ఉంటోంది. దీనివల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పర్యాటకులు భారీగా ఏజెన్సీ బాట పడుతున్నారు. ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ఈ మంచు అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మరోవైపు బాపట్లజిల్లా చినగంజాంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చినగంజాం, పెదగంజాం, కడవకుదురు, సముద్రతీరప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. జాతీయరహదారి పై ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనపడక చోదకులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచుతెరలు వీడలేదు.
Comments