Annavaram Satyanarayana Swamy Kalyanam 2026 : త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవారి పరిణయ వేడుకతో రత్నగిరి మురిసింది. అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణాన్ని తిలకించిన భక్తజనం పరవశించింది. ముందుగా స్వామివారిని వెండి గరుడవాహనంపై, అమ్మవారిని గజవాహనంపై, పెళ్లి పెద్దలు సీతారాములవారిని వెండిపల్లకిపై ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అత్యంత సుందరంగా స్వామి, అమ్మవార్లను అలంకరించి రాత్రి 9 గంటలకు కల్యాణవేదిక వద్దకు తీసుకువచ్చి పెళ్లి పెద్దలు సీతారాముల పక్కనే ఆశీనులను చేశారు. చైర్మన్ రోహిత్, ఈవో చక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కల్యాణ వేదిక వద్దకు పట్టు వస్త్రాలు, పండ్లు శిరస్సుపై ఉంచి వేదిక వద్దకు తీసుకువచ్చిన తర్వాత కల్యాణ తంతు ప్రారంభించారు. విఘ్నేశ్వరపూజతో ప్రారంభించి, కన్యావరణం, గౌరీపూజ, ప్రవర, యజ్ఞోపవేతదారణ అనంతరం మంగళకరమైన జిలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామి, అమ్మవార్ల శిరస్సుపై అర్చకస్వాములు అలంకరించారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది. ఒకరి శిరస్సుపై మరోకరు తలంబ్రాలు వేసే ఘట్టం భక్తజనులను ఆనందపరవశంలో ముంచెత్తింది.
Comments