Vontimitta Bramhosthavam 2026 : కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం వేణుగాన అలంకారంలో సీతారామ లక్ష్మణ సమేత శ్రీరాములవారు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లను పండితులు ప్రత్యేకంగా అలంకరించారు. సతీ సమేత స్వామిని చూసి భక్తులు పరవశించిపోయారు. శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక భావంతో ముంచెత్తాయి. అడుగడుగునా భక్తులు సీతారామ లక్ష్మణులకు కర్పూర హారతులు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. మాడ వీధుల్లో, గ్రామ పుర వీధుల్లో రాములోరిని ఊరిగింపుగా తీసుకెళ్లారు. భజన బృందాల గానాలు, కోలాటాల నడుమ వీధుల్లో వాహన సేవ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ పురోహితులు తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అందరూ స్వామి వారి దివ్య రూపాన్ని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒంటిమెట్టలో శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాలు 2026, ఏప్రిల్ 5 వరకు వైభవంగా కొనసాగనున్నాయి.
Comments