Sitarama Kalyanam In Dargah : శ్రీరామనవమి అంటేనే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భద్రాచలం పుణ్యక్షేత్రం. అక్కడ ప్రతిఏటా సీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవంగా జరుపుకుంటారు. అదే విధంగా ఈసారి కూడా స్వామివారి వివాహ ఘట్టం కన్నులపండువగా జరిగింది. అయితే ఇదే ప్రాంతంలో శ్రీరామనవమి వేడుక దర్గాలో జరగడం మరో ప్రత్యేకతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు సత్యనారాయణపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉన్న హజరత్ ఖాసీం దుల్హ నాగుల్ మీరా దర్గాలో రాములవారి కల్యాణం జరిగింది. మతసామరస్యానికి ప్రతీకగా హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ సీతారాముల కల్యాణం చూడముచ్చటగా చేశారు. దర్గా మాలిక్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హిందూ పూజారులచే మంగళ వాయిద్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాచలం తీరున ఎదుర్కోలు, అభిజిత్ లగ్నంలో కల్యాణ ఘట్టం జరిపించారు. దీంట్లో హిందువులతో పాటు ముస్లింలు కూడా పాల్గొని స్వామివారిని పూజించడం విశేషం. ఇప్పటికే ఉర్సు ఉత్సవాలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ దర్గాకు గుర్తింపు ఉండగా ఈ వేడుకతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది.
Comments