Central Minister Piyush Goyal Participated In World Environment Day celebrations : కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు కేంద్రమంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేయగా ఈవో, అదనపు ఈవోలు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పర్యావరణ దినోత్సవంలో: అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పద్మావతి అతిధి గృహం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ 'ఏక్ పేడ్ మా కే నామ్' పిలుపుతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ టీటీడీ ఈవో, అదనపు ఈవోలతో కలిసి అక్కడ మొక్కను నాటారు. ప్రతి ఏటా తన పుట్టిన రోజుకు ముందు శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీవారి ఆశీస్సులు దేశ ప్రజలందరి మీద ఉండాలన్నారు. మంత్రి లోకేశ్కు ప్రశంసలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమాచార సాంకేతికతను తీసుకొస్తున్న ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రం ఒక అద్భుతమని కేంద్రమంత్రి అన్నారు. స్వయంగా టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. రాష్ట్రంలో ఐటీకి పెద్ద పీట వేస్తున్న నారా లోకేశ్కు, 100 రోజుల్లో కమాండ్ కేంద్రంను ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments