Pawan Visit Mangalagiri Panakala Swamy Temple : గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామిని ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పానకం సమర్పించారు. దర్శనానంతరం ఉప ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ రాకతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆయన ఫొటోను తమ సెల్ఫోన్లలో బంధించేందుకు అక్కడి వారు పోటీ పడ్డారు.మహిమాన్విత శ్రీనరసింహ క్షేత్రాల్లో మంగళగిరి ఒకటి. తెరిచి ఉన్న నోటితో మూలవిరాట్ స్వరూపం దర్శనమిస్తుంది. ఇక్కడ పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ స్వామివారు పానకాల స్వామిగా ప్రసిద్ధి పొందారు. భక్తులు తాము తెచ్చిన పానకం స్వయంగా స్వామివారికి సమర్పించవచ్చు. ఆ పానకంలో సగం స్వామివారికి, మిగతా సగం తెచ్చిన భక్తునికి ఇస్తారు. నరసింహస్వామికి పానకం నోట్లో పోస్తున్నప్పుడు గుటక మింగిన శబ్దం కూడా వినిపించడం గొప్ప వింత. ఎందరెందరో భక్తులు సమర్పించే బెల్లంపానకం కాస్త ఒలికి కింద పడుతుంటుంది. అయినా కూడా ఆ పరిసరాల్లో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషం. దీని వెనకున్న కారణమేంటో, అంతరార్థమేంటో ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టలేదు.
Comments