Kondapalli Dolls Festival : శతాబ్దాల చరిత్ర కలిగిన, తెలుగు సంస్కృతికి నిజమైన ప్రతిబింబమైన కొండపల్లి బొమ్మల కళను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఏప్రిల్ 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన "కొండపల్లి బొమ్మల పండుగ-2026" ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. "సహజ రంగులు, అద్భుతమైన సృజనాత్మకతతో రూపొందించబడే కొండపల్లి బొమ్మలు మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తాయి. గత ఐదేళ్లుగా ఈ కళలు వాటిని ఆదరించే కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని కళలను వాటి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఏటా ఏప్రిల్ 18 నుంచి 20 వరకు కొండపల్లి బొమ్మల పండుగను పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు. సమీప పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక 'టూరిజం సర్క్యూట్' ఏర్పాటు చేస్తామని కలెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు.
Comments