Municipal Elections in Telangana : ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురిచేస్తుంటారు. ఇలా ఓ అభ్యర్థి ఎలాగైనా గెలవాలని ఓటర్లకు డబ్బు, చీరలు, ఇతర తాయిలాలు రకరకాల బహుమతులు అందజేశారు. తీరా చూస్తే ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీంతో ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి తాము ఇచ్చిన చీరలు, నగదును వసూలు చేశారు. ఇలా ఓటర్లకు ఇచ్చిన డబ్బులు, బహుమతులు తిరిగి తీసుకెళ్తున్న క్రమంలో కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మూడు చింతలపల్లి మున్సిపాలిటీలోని పొన్నాల వార్డులో జరిగింది. ఆ వార్డులోని ప్రజలు చీరలు ఎవరు ఇవ్వమన్నారని తీసుకుంటున్న వారిపై మండిపడ్డారు. ఇలా ఇవ్వడం తీసుకోవడం మంచిది కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సారి మా అభ్యర్థినే పోటీలో నిలుపుతామని తేల్చి చెప్పారు. ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా తాయిలాల పంపిణీ మాత్రం ఆగడం లేదు.
Comments