Two Persons Died After Falling Into A Fish Pond In Palnadu District : ప్రమాదవశాత్తు చేపల చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా కొమ్మాలపాడుకు చెందిన అగ్రహరం హుస్సేన్ (32), పిట్టంబండ్ల హుస్సేన్ బుడే (53)లు కాకాని గ్రామంలో చేపల చెరువును లీజుకు తీసుకుని గత కొంతకాలంగా చేపల పెంపకం చేస్తున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున చేపలకు మేత వేసేందుకు అగ్రహరం హుస్సేన్, పిట్టంబండ్ల హుస్సేన్ బుడేలు, మరో కూలీతో కలిసి పడవలో చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో ముగ్గురు చెరువులో పడ్డారు. వారిలో కూలీ ఈదుకుంటూ ఒడ్డుకు రాగా అగ్రహరం హుస్సేన్, పిట్టంబండ్ల హుస్సేన్ బుడేలు ఇద్దరూ చెరువులో గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరి కోసం గ్రామస్థులు గాలింపుచర్యలు చేపట్టగా వారిలో పిట్టంబండ్ల హుస్సేన్ బుడే మృతదేహం దొరికింది. అగ్రహరం హుస్సేన్ మృతదేహం కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది మరో పడవను తీసుకువచ్చి అగ్రహరం హుస్సేన్ మృతదేహం కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
Comments