Retaining Wall Pending Works at Krishna River in Vijayawada : విజయవాడ కృష్ణానదికి వచ్చే వరద నుంచి రిటైనింగ్ వాల్ నదీ పరివాహక ప్రాంత ప్రజలకు రక్షణగా నిలుస్తోంది. అయితే రామలింగేశ్వర నగర్ నుంచి యనమల కుదురు సరిహద్దు ప్రాంతం వరకు 400 మీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మించకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో గతంలో సంభవించిన వరదలకు రామలింగేశ్వర నగర్, యనమల కుదురు ప్రాంతాల్లోని అనేక కాలనీలు ముంపుకు గురయ్యాయి. దీంతో కూటమి ప్రభుత్వం అర్థాంతరంగా ఆగిపోయిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. దీనిపట్ల స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తమౌతుంది. ఈ పనులు ప్రారంభించినా గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. మధ్యలో ఆగిపోయిన ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ పనులకు గత ఏడాది డిసెంబర్లో రూ.కోటి అరవై లక్షల 79వేల రూపాయలతో హోం శాఖామంత్రి అనిత శంకుస్థాపన చేశారు.
Comments