Satwiksairaj Meets Lokesh : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్ను మంత్రి లోకేష్ అభినందించారు. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ అర్జున అవార్డుతో పాటు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఎన్నో పతకాలు సాధించారు. ప్రస్తుతం పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్నారు. 2023 అక్టోబర్ 10న డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్-1 ర్యాంకును సాధించారు. ఇటీవల జరిగిన థామస్ కప్లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో సాత్విక్ సాయిరాజ్ మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ ఎస్.భరణి పాల్గొన్నారు.
Comments