Peddapatnam Mahotsavam at Mallanna Temple : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో పెద్దపట్నం మహోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం అర్థరాత్రి ఆలయ తోటబావి ప్రాంగణంలో ఒగ్గు పూజారులు సంప్రదాయ బద్ధంగా పంచరంగులతో 41 వరుసల పెద్దపట్నం వేశారు. లింగోద్భవ కాలంలో గర్భగుడిలో వీరశైవ అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మల్లన్న కల్యాణాన్ని ఒగ్గుపూజారులు ఘనంగా జరిపారు. ముందుగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, యాదవ పూజారులు గంగ తెప్పలో ఊరేగింపుగా తీసుకెళ్లి కోనేటిలో స్నానమాచరింపజేశారు. అనంతరం పట్నం వద్ద అష్టదిక్కులకు నిమ్మకాయలు, గుమ్మడికాయలతో బలిహరణ చేసి, ఉత్సవ విగ్రహాలతో అర్చకులు పట్నం దాటారు. భక్తులు తరలి రావడంతో ఉద్రిక్తత : భక్తులు మల్లన్న నామస్మరణతో పట్నంపై చిందులేస్తూ తన్మయత్వం చెందారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో బారికేడ్లు దాటి పట్నం వైపు భక్తులు పరుగులు తీయడంతో పోలీసులు లాఠీలు ఝలిపించాల్సి వచ్చింది. ఈ ఘటనలో పలువురు భక్తులతో పాటు కొందరు పోలీసులకు గాయాలైనట్లు తెలిసింది.
Comments