Telangana Institute of Medical Sciences in Hyderabad : పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టిమ్స్(తెలంగాణ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులకు శ్రీకారం చుట్టింది. నేడు మొట్టమొదటి టిమ్స్ ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సనత్నగర్ టిమ్స్లో ముఖ్యంగా 4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్డియక్ సైన్సెస్, ట్రామా కేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలకు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఏర్పాటు చేశారు. మొత్తం 1000 పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 300 పడకలు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సేవలకు కేటాయించగా, 100 పడకలు ఈహెచ్ఎస్ కోసం, 30 పడకలను డయాలసిస్ సేవల కోసం, వీఐపీ, విదేశీ రోగుల కోసం మరికొన్ని పడకలను ప్రత్యేకంగా కేటాయించారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అంబులెన్సు సేవలు, డయాగ్నోస్టిక్స్, రోగులు ఎక్కువ సేపు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నర్స్ కాలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది మే నుంచే ఓపీ ట్రయల్ రన్ను నిర్వహిస్తుండగా, రోజుకు దాదాపు 300 మందికి చికిత్స అందిస్తున్నారు.
Comments