World Bicycle Day Celebrations in Hyderabad : ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో భారీ సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. నార్సింగి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ సైక్లింగ్ ట్రాక్ వద్ద దీనిని ఏర్పాటు చేశారు. ఈ 'మెగా సైక్లింగ్ రైడ్స్' కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. స్మార్ట్ బైక్, హైదరాబాద్ బైసైకిలింగ్ క్లబ్, వరల్డ్ సైక్లింగ్ అలైన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో 2,500 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగాల్లో చిన్నారులు, యువత, మహిళలు, సైక్లింగ్ ఔత్సాహికులు ఉత్సాహంగా రైడ్ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. కాలుష్య నియంత్రణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు చండీగఢ్, న్యూదిల్లీల్లో కూడా ఏకకాలంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 5 వేల మందికి పైగా సైక్లింగ్ ప్రేమికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్ డైరెక్టర్ రాచెస్ ఎల్లా, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ అధ్యక్షుడు టి.సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైక్లింగ్ను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యం-పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగాన్ని పెంచాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Comments