Ujjaini Mahankali as Goddess Shakambari : సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు విశేష దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి 500 కిలోల తాజా కూరగాయలు, ఆకుకూరలతో వైభవంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ముత్యాల అభిషేకాలు, కుంకుమార్చనలు, హారతులు నిర్వహించారు. అమ్మవారు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు ఆలయానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శాకాంబరీ దేవిగా దివ్యదర్శనం ఇవ్వడంతో భక్తులు మంత్రముగ్ధులు అయ్యారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో ఆలయ ప్రాంగణమంతా పచ్చదనంతో పరిమళించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలకు కురవాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారు. కరవు కాటకాలు తొలగిపోవాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ ప్రత్యేక కూరగాయల అలంకరణ చేస్తారు.
Comments