Mid Day Meals Scheme In Annavaram Educational Schools And Colleges : కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో విద్యార్థులకు సత్యదేవుని అన్నప్రసాదాన్ని ఉచిత మధ్యాహ్న భోజన పథకం ద్వారా పంపిణీని ప్రారంభించారు. దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నత పాఠశాల, జూనియర్ డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు పంపిణీని ఘనంగా ప్రారంభించారు. ఈవో సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పర్వత సురేశ్, కామర్స్ చిరంజీవి రావు తదితరుల చేతుల మీదుగా ఆయా కళాశాలల్లో విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. స్వామివారి గోదుమనూక ప్రసాదం, పులిహోర, పప్పు, రైస్, పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ అందించగా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరుకు అనుగుణంగా ప్రతి రోజూ మూడు విద్యాసంస్థల్లో సుమారు 600 మందికి భోజనాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్ధిక, ఆరోగ్య ఇబ్బందులను దృష్టిలోకి ఉంచుకుని నిత్యాన్నదాన పథకం ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని సంకల్పించామని, విద్యాభివృద్ధిలో భాగంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అంతా సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఈవో విద్యార్థులకు సూచించారు.
Comments