Flight Journey For 10th Class Students : సాధారణంగా పాఠశాలలోని పిల్లలు పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే యాజమాన్యం శుభాకాంక్షలు తెలుపుతుంది. లేదా చిన్నా చితకా బహుమతులు వారి కష్టానికి ప్రతిఫలంగా అందజేస్తుంది. కానీ కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు మండలం కానూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బంపరాఫర్ ఇచ్చింది. ఇటీవల పది ఫలితాల్లో 20 మంది విద్యార్థులకు 500 మార్కులపైగా మార్కులు రావడంతో పాఠశాల వ్యవస్థాపకుడు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అన్నే శివ నాగేశ్వరరావు శుభ పరిణామం అని కొనియాడారు. అంతేకాకుండా తన సొంత ఖర్చులతో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులను గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వరకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుని అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతామని అన్నారు. రాబోయే కాలంలో ఈ పాఠశాల నుంచి మరింత మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పి. విజయలక్ష్మి, ఉపాధ్యాయుల సంఘం నేత కొనకల్ల రెడ్డమ్మ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోకినాల అజ్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments