Special Prayers for AP Budget Copies at Indrakiladri : రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఇతర ఆర్థిక శాఖ అధికారులు సూరజ్ గనోరే, గౌతమ్ అల్లాడ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన అధికారులకు ఆలయ ఈవో శీనా నాయక్ ఘనస్వాగతం పలికారు. అర్చకులు బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అధికారులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం అధికారులకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ నిర్విఘ్నంగా అమలు కావాలని అధికారులు ప్రార్థించారు.కనకదుర్గమ్మ వారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అనంతరం వాటిని మంత్రి పయ్యావుల కేశవ్కు అందజేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ ప్రతులను దేవుడి పటాల ముందు పెట్టి ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయల్దేరిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మార్గమధ్యలో వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments