Minister Narayana Comments About Fresh Waste Plants in the State : రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డులు లేకుండా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులలో "వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్" ఉండగా అదనంగా మరో ఆరు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి నారాయణ కొండపల్లి మున్సిపాలిటీలో పర్యటించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలిసి కొత్తగా నిర్మించిన "ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్"ను పరిశీలించారు. ఈ సందర్భంగా 107 మున్సిపాలిటీలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను నిర్వహించడానికి తాజా వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజూ 5,385 టన్నుల వ్యర్థాలను కంపోస్ట్, బయోగ్యాస్గా మారుస్తున్నట్లు మంత్రి వివరించారు. గత ప్రభుత్వం "వ్యర్థ పన్ను" విధించినప్పటికీ దానివల్ల ఏకంగా 15 లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయని, గత ప్రభుత్వం వదిలిపెట్టిన ఈ వ్యర్థాలను తొలగించే పనిని ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే నెల చివరి నాటికి ఈ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి వాటిని కార్యాచరణలోకి తెస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.
Comments