Elephants Roaming on Bhakarapeta Route in Tirupati District: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల సంచారంతో సుమారుగా గంటకు పైగా వాహన రాకపోకలు స్తంభించాయి. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఏనుగుల గుంపు ఓ ద్విచక్ర వాహనదారుడ్ని తరుముతూ భయపెట్టాయి. వాటి నుంచి తప్పించుకుని రంగంపేట తనిఖీ కేంద్రం వద్ద అటవీ సిబ్బందికి అతడు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు వాహనదారుల్ని అప్రమత్తం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అటవీ శాఖ ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు. ఆపై సుమారు గంటసేపు శ్రమించి కనుమ రహదారిలోని ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేశారు. గంటకుపైగా వాహనాల రాకపోకలు స్తంభించడంతో ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమిన అనంతరం వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఎమ్మెల్యే ఆదేశంతో భాకరాపేట కనుమ రహదారిలో రెండు, మూడు రోజులు పాటు రాత్రి పూట గస్తీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments