Final Day Balusulamma Jathara in West Godavari District : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ బలుసులమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. జాతరలో చివరి రోజైన నేడు మహా కుంభ నివేదన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ భారీ ఎత్తున నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాకుంభ నివేదనలో పులిహోరతో అమ్మవారి ఆకారం, పూలతో అలంకరించిన శివలింగం భక్తులను కనువిందు చేశాయి. అలాగే అమ్మవారికిి భక్తులు నైవేద్యంగా సమర్పించిన వివిధ రకాల స్వీట్లు ఆకట్టుకున్నాయి. మహాకుంభ నివేదన అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన పులిహోరతో అద్భుతమైన 'పులిహోర అలంకారం' చేయడం ఇక్కడి ప్రత్యేకత. అలాగే మహాకుంభ నివేదన తర్వాత, అమ్మవారికి అర్పించిన ప్రసాదాన్ని భక్తులకు విస్తృతంగా పంచుతారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది మహిళలు, భక్తులు ఆలయానికి తరలివస్తారు. ఈ జాతరలో సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments