Drunken Man Halchal on Cell Tower in Markapuram District : మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో మద్యం మత్తులో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పట్టణంలోని తిరుమలగిరి కాలనీకి చెందిన హనుమతు అనే యువకుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ పైకి ఎక్కాడు. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉండి ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఆ యువకున్ని కిందకు దించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రజలు విశ్వ ప్రయత్నాలు చేశారు. రెండు గంటల తరువాత తానే కిందకి దిగేందుకు ప్రయత్నించాడు. యువకుడు కిందకు దిగే విధానం చూసిన స్థానికులు ఎక్కడ పట్టు జారుతుందో అని భయందోళనకు గురయ్యారు. టవర్ సగం దూరం వరకు వచ్చే సరికి ఆ యువకుడు అస్వస్థకు గురయ్యారు. వెంటనే స్థానికులు టవర్పైకి ఎక్కి అతనికి నీరు తాగించి సురక్షితంగా కిందకి దించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నీకు ఏమి కావాలి అని ఎస్సై దేవకుమార్ ఆ యువకుడ్ని అడుగుగా అతడు నాకు మద్యం కావాలి ఇప్పించండి సార్ అంటూ బదులిచ్చాడు. ఆ యువకుడు అప్పటికే అధికంగా మద్యం మత్తులో ఉండడంతో 108 అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments