Farmers Stopped Construction Work on Bengaluru-Kadapa-Vijayawada Road : ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడి పంచాయితీ పరిధిలోని తిమ్మారెడ్డి పాలెం వద్ద బెంగళూరు-కడప-విజయవాడ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రహదారి నిర్మాణంలో భారీ వాహనాల రాకపోకలతో దట్టంగా దుమ్ము లేస్తుండటంతో ఇరువైపులా ఉన్న పంట పొలాలు మట్టి కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు తిరిగే సమయంలో నీళ్లు చల్లాలని కోటికలపూడి రైతులు అనేకమార్లు నిర్వాహకులకు విన్నవించారు. అయినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తూ నీళ్లు చల్లే పనులను చేపట్టలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు ద్విచక్ర వాహనాలను అడ్డుగా పెట్టి నిర్మాణ పనులను నిలిపివేశారు. రోడ్డుపై నీళ్లు చల్లిన తర్వాతే వాహనాలు తిప్పేలా చర్యలు తీసుకునే వరకు పనులు నిలిపివేస్తామని రైతులు చెప్పారు. రోడ్డు పనులు ఆపిన విషయం మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలుసుకొని స్థానికంగా ఉన్న వ్యక్తిగత సలహాదారునితో చరవాణిలో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన వ్యక్తిగత సిబ్బంది కాంట్రాక్టరుతో సంప్రదింపులు జరపగా వారు రెండు వాటర్ ట్యాంకర్లను గ్రామస్థులకు అప్పగించి వీటితో మీరు నీరు చల్లాలని కోరారు. దానికి సమ్మతించిన గ్రామస్థులు రహదారి పనులకు అడ్డు తప్పుకోవటంతో రహదారి పనులు ముందుకు సాగుతున్నాయి. మంత్రి గొట్టిపాటి చొరవతో సమస్య పరిష్కారం అవ్వడంతో గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments