Tirupathamma Kalyana Mahotsavam : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పెనుగంచిప్రోల్లో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదిక పైకి ఆలయం నుంచి శ్రీ గోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. కళ్యాణ వేదికపై ఉంచి వేదమంత్రాలతో, శాస్త్రోతంగా కళ్యాణం నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, వస్త్రాలను సమర్పించారు. ఆచార, సంప్రదాయం ప్రకారం కాకాని వంశీకులు తరఫున కాకాని రవిబాబు, త్రివేణి దంపతులు, కొల్లా వంశీకుల నుంచి కొల్లా హరికృష్ణ, భవ్య శ్రీ దంపతులు కళ్యాణం పీటల మీద కూర్చున్నారు. అదేవిధంగా మాజీమంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆర్డీవో బాలకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేశ్ బాబు దంపతులు కళ్యాణంలో ప్రాతినిధ్యం వహించారు. అమ్మవారి కళ్యాణం వేలాది మంది భక్తుల గోవింద నామాలు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి దీక్ష స్వాములు, వారి దీక్ష విరమించిన అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
Comments