Tourists Throng Vanjangi for Spectacular Sunrise View: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యం అందాలకు నెలవు. అక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. గజగజ వణికించే చలిని సైతం వారు లెక్కచేయలేదు. వాహనాలను కొండ దిగువనే నిలిపివేశారు. అక్కడి నుంచి అత్యంత క్లిష్టమైన మార్గంలో, ఇష్టంగా మేఘాల కొండ పైకి ట్రెక్కింగ్ చేశారు. శిఖరంపైకి చేరగానే వారి ప్రయాణ బడలిక మాయమైంది. కళ్ల ముందు సాక్షాత్కరించిన ప్రకృతి అందాలను చూసి వారు పరవశించిపోయారు. పాల సముద్రాన్ని తలపించే మేఘాలు, వాటిని చీల్చుకుంటూ వస్తున్న బాలభానుడి కిరణాలు పర్యాటకులను కట్టిపడేశాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తన్మయత్వం పొందారు. యువత కేరింతలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ మధుర జ్ఞాపకాలను పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. మేఘాల మధ్య దిగిన సెల్ఫీలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
Comments