Nara Bhuvaneswari Kuppam Visit : సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్ట్రీ నారా భువనేశ్వరి ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు నారా భువనేశ్వరి కుప్పం మండలంలో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు విద్యార్థులతో మాట్లాడారు. టీడీపీ శ్రేణులకు పార్టీ బలోపేతంపై సూచనలిచ్చారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. నారాయణపురం తండా కావలి మడుగులో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. నంద్యాల ఎకో టూరిజం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు తాను ప్రతి మూడు నెలలకు ఓ దఫా కుప్పంలో పర్యటిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపైనే ఉందన్నారు. కుప్పం నియోజకవర్గం హంద్రీనీవా జలాలతో ప్రస్తుత కరువు పరిస్థితుల నుంచి ఉపశమనం పొందుతుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబును ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు రుణపడి ఉంటానని భువనేశ్వరి వెల్లడించారు.
Comments