Heroic Rituals Of Veera Shaivas In Srisailam : ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బుధవారం రాత్రి జరిగిన వీరాచార విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. క్షేత్ర పరిధిలోని శివదీక్ష శిబిరాల వద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. వీరశైవ భక్తులు అగ్నిగుండం వద్ద వీరాచార విన్యాసాలు ప్రదర్శించారు. వీరశైవ భక్తులు ఇనుప చువ్వలను చేతులు, నొసటికి గుచ్చుకొని అబ్బురపరిచారు. చివరగా కనకనలాడే నిప్పు కణుపుల అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఈ ఉగాది ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తారు. వీటిలో స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, ప్రత్యేక అలంకారాల సేవలు నిర్వహిస్తారు. ఉగాది వేడుకల్లో ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శ్రీశైలానికి తండోపతండాలుగా భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో ఉగాది సందడి నెలకొంది. ప్రజలంతా కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించారు. పంచాగ శ్రవణం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతరలు నిర్వహిస్తున్నారు.
Comments