President Draupadi Murmu visit Tiruchanur temple: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 2 రోజుల పర్యటన కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు మంత్రి అనితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆమె తిరుచానూరు వెళ్లారు. ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనిత, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, దేవదాయ శాఖ కార్యదర్శి శ్రీ హరి జవహర్ లాల్తో పాటు జిల్లా అధికారులు స్వాగతం చెప్పారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను మంత్రులు, టీటీడీ అధికారులు అందజేశారు. అనంతరం తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు పద్మావతి అతిథిగృహం వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతికి హోంమంత్రి అనిత, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్న రాష్ట్రపతి ముర్ము ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి హైదరాబాద్ వెళ్లనున్నారు.
Be the first to comment