Tirumala Salakatla Brahmotsavam : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. శ్రీ మలయప్ప స్వామి వారు యోగా నరసింహమూర్తి అలంకారంలో ముస్తాబయ్యారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రతీకగా స్వామివారు మాడ వీధుల్లో విహరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగిపోయాయి. వాహన సేవకు ముందు అశ్వాలు, గజరాజులు ముందుకు కదిలాయి. జీయర్ స్వాముల గోష్ఠి గానం భక్తి భావాన్ని మరింత పెంచింది.వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాల నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి భక్తిశ్రద్ధలతో కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం జరిగిన సింహ వాహన సేవ కన్నుల పండువగా ముగిసింది. ఇక మూడో రోజు రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ జరగనుంది. చల్లని ముత్యాల పందిరి కింద విహరించే మలయప్పను చూసి తరించేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు.
Comments