Dadinamma Dance In Ravindra Bharati : హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన వేదికగా అరుదైన నృత్యం ఆవిష్కృతం అయ్యింది. 'దాదినమ్మ కలాపం' పేరిట ఏర్పాటు చేసిన ఈ నృత్య రూపకాన్ని డాక్టర్ రమాదేవి నడుముకు మంచం కట్టుకొని చేశారు. శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ గురు డాక్టర్ రమాదేవి వారి అమ్మను స్మరించుకుంటూ ఇచ్చే 11వ మీనాక్షి అమ్మ అవార్డు ప్రదానోత్సవ సందర్భంగా ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.అల్లంపాటి అగస్త్యుడు రచించిన 'నీలావతి విజయం' యక్షగానాన్ని కూచిపూడి భాగవతులు "దాదినమ్మ" అనే వేషకథగా ప్రదర్శించే వారు. దాదినమ్మ అంటే సాధారణంగా బిడ్డను లేదా ఇంటిని సంరక్షించే దాది అని అర్థం. అయితే ఈ యక్షగానమంతటా పరిశీలిస్తే దాదినమ్మ అనే పాత్ర ఎక్కడా కనిపించదు. ఈ రచనలో ప్రధాన పాత్ర అయిన నీలావతి, తన జీవితంలో ఎదురైన దురదృష్టాన్ని తలచుకొని వేదనతో విలపిస్తూ తన గోడును తానే చెప్పుకునే స్వగత రూపంలో కథను ముందుకు నడిపిస్తుంది. భారతీయ నాట్య సంప్రదాయంలో దీనిని గోడు చెప్పుకోవడం అనే ఏకపాత్రాభినయ స్వరూపంగా భావించవచ్చు. పాశ్చాత్య నాటక పరిభాషలో దీనిని 'Soliloquy' అంటే తెలుగులో స్వగతం అని వ్యవహరిస్తారు. వీటన్నింటినీ నృత్య కారిణి డాక్టర్ రమాదేవి ఈ నృత్య రూపకంలో చక్కగా చూపించి, కళాప్రియులను ఆకట్టుకున్నారు. నాట్య సంగీత కేంద్ర (త్రివేండ్రం ) డైరెక్టర్, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి గిరిజా చంద్రన్కు మీనాక్షి అమ్మ అవార్డును ప్రదానం చేశారు.
Comments