Ujjaini Mahankali Bonalu 2026 : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మినీ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం జరగబోయే బోనాల నేపథ్యంలో ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. మహంకాళి అమ్మవారికి వడిబియ్యం, కట్నకానుకలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి దర్శించుకున్నారు. గీతారెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం గర్భాలయంలో ఉన్న అమ్మవారిని గీతారెడ్డి దర్శించుకున్నారు. మహంకాళికి ప్రత్యేక మెుక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. అమ్మవారి స్మరణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బోనాలతో వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మినీ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళ భక్తులు తరలి రావడం విశేషమని పేర్కొన్నారు.
Comments