Mass Varalakshmi Vrathams At Yadadri : నిత్యం వేలాది మంది దర్శించుకొనే ప్రముఖ యాదగిరి క్షేత్రానికి శ్రావణ మాసం కారణంగా భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఇవాళ శ్రావణ శుక్రవారం కావడంతో శ్రీ లక్ష్మీ సమేతుడైన స్వామివారికి వరలక్ష్మీ వ్రతాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పర్వదినాన ఎక్కువ మొత్తంలో భక్తులు పాల్గొనాలనే ఉద్దేశంతో ఎలాంటి రుసుము లేకుండానే ఉచితంగా వ్రతాలు చేయించే సదుపాయాన్ని కల్పించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. పురోహితులను అనుసరిస్తూ భక్తులు చేసిన మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణంలో లక్ష్మీదేవి, స్వామివార్ల నామస్మరణలు మార్మోగాయి. ఈ ప్రత్యేక సదుపాయంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి వ్రతాలు చేసి, అమ్మవారి కటాక్షం పొందగలిగామని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఈ ఏర్పాట్లు కొనసాగించాలని కోరారు. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాలు జరిపిస్తే కోరిక కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Comments