Kothuru Tadepalli Lorry Fire Incident : విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లిలో అక్రమ మట్టి రవాణా మరోసారి కలకలం రేపింది. ఇవాళ మట్టి లోడ్తో వెళ్తున్న ఓ లారీకి 11 కేవీ విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో టైర్లు, బాడీకి మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు ఆ సమయంలో అటువైపు జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిని మంటలను అదుపులోకి తెచ్చారు. కొత్తూరు తాడేపల్లి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అయినా వారిని పట్టించుకోలేదు. లారీలు ఇష్టానుసారంగా తిరుగుతుండటం వల్ల రోడ్లు దెబ్బతినడమే కాకుండా, ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments