Giant Fish Catch Duduma Reservoir : ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల డుడుమా జలాశయానికి ఉద్ధృతంగా వరద నీరు వచ్చి చేరింది. జలాశయంలో నీటి మట్టం ఒక్కసారిగా ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక గేటును ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ వరద నీరు అక్కడి గిరిజనుల పాలిట అదృష్టంగా మారింది. మాచ్ ఖండ్ విద్యుత్ కేంద్రం దిగువన ఉన్న గ్రామాలకు ఈ వరద ప్రవాహం చేరుకుంది. ఆ నీటిలో స్థానిక గిరిజనులకు నాలుగు భారీ చేపలు దొరికాయి. అందులో ఒక్కో చేప బరువు సుమారు 20 కిలోలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ఇలాంటి భారీ చేపలు దొరకడం చాలా అరుదు.ఇంత పెద్ద చేపలు దొరికాయన్న వార్త చుట్టుపక్కల వేగంగా వ్యాపించింది. దీంతో ఆ చేపలను చూసేందుకు, కొనుగోలు చేసేందుకు జనం భారీగా ఎగబడ్డారు. సిందిగూడ గ్రామానికి చెందిన గిరిజనులు ఈ చేపలను కిలో 150 రూపాయల చొప్పున అక్కడికక్కడే విక్రయించారు. కేవలం నాలుగు చేపలతోనే వారు మంచి ఆదాయం పొందారు.
Comments