Robbery In Jewellery Shop in Tenali : తెనాలి గంగానమ్మపేటలో భారీ చోరీ జరిగింది. శ్రీ సాయి బాలాజీ జ్యువెలర్స్లో అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. దుండగులు షాపు షట్టర్ తాళాలను ఇనుప రాడ్డుతో పగలగొట్టి లోపలికి ప్రవేశించి 10 కేజీల వెండి, 10 గ్రాముల బంగారం అపహరించారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న గూర్ఖా సుమారు 2:30 గంటల సమయంలో షాపు తాళాలు పగలగొట్టి ఉన్న దృశ్యాన్ని గమనించి యజమాని రామారావుకు సమాచారం అందించాడు. యజమాని వెంటనే టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాములు నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. చోరీ సొత్తు విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని యజమానులు తెలిపారు. బంగారం, వెండి షాపులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో జరిగిన భారీ చోరీ స్థానికులలో తీవ్రమైన కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. "బుధవారం అర్ధరాత్రి సమయంలో 10కిలోలు వెండి, బంగారం,చోరీ జరిగినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా ఇద్దరు యువకులు చోరీ చేసినట్టు తెలిసింది. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం". - రాములు నాయక్, సీఐ
Comments