Water Problem In Krishna District : నిత్యావసరం అయిన తాగునీటి కోసం ఆ ప్రాంత వాసులు ప్రతీ రోజు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ప్రతీ రోజు ఇవాళ నీరు దొరుకుతుందో లేదో తెలియని ఆందోళనతో గడుపుతున్నారు. నిద్రలేవడం ఆలస్యం ప్రజలందరూ బిందెలు పట్టుకుని కుళాయి దగ్గరకు పరుగులు తీస్తారు. ఆ క్షణం ఆలస్యమైతే ఇక అంతే సంగతి. ఆ రోజు గొంతు ఎండాల్సిందే. వెళ్లిన వెంటనే నీరు పట్టేసుకుందామంటే కూడా కుదరదు. క్యూలో నిల్చోవాలి. అంతటితో అయిపోయిందనుకుంటే కాదు. ఎంతో ఓపిక పట్టినా పది అడుగుల లోతున ఉండే గొయ్యిలోని కుళాయిల నీటిని డబ్బాలతో తోడితేనే బిందె నిండేది. గుక్కెడు నీటి కోసం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం దీనదయాల్ పురం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బిందె నీటి కోసం పనులు మానుకుని కళ్లుకాయలు కాచేలా మహిళలు ఎదురు చూస్తున్నారు. గుంతలోకి దిగి నీటిని డబ్బాలతో తోడుకుంటున్నారు. దీనికి తోడు బిందెడు నీరు సరిపోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటుకోవడంతో నీటి కష్టాలు ఈ గ్రామస్థులకు రెట్టింపయ్యాయి. వాటర్ ట్యాంక్కు పైప్ లైన్లు వేసి నీటి కష్టాలు తీర్చాలని గ్రామస్థులంతా అధికారులను వేడుకుంటున్నారు. "నీళ్లు లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు వేస్తే నీళ్ల సమస్య తీరుస్తామంటారు. గెలిచాక వాళ్లు చేస్తారు వీళ్లు చేస్తారని చెప్తారు. ఐదు నెలల క్రితం కుళాయి కట్టారు. ఇంకా అది ఓపెనింగ్ కాలేదు" - గ్రామస్థుడు
Comments