Abids Iscon Temple Golden Jublee Celebrations : హైదరాబాద్లోని అబిడ్స్ ఇస్కాన్ ఆలయ స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో తొలి అధ్యాత్మిక కేంద్రంగా సేవలందిస్తున్న ఈ మందిరం 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 15 నుంచి 18 వరకు రాధా మదనమోహన మందిర స్వర్ణోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ సమయంలో ప్రతి రోజూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మందిరంలో ప్రభుపాదుల కీర్తి, చరిత్ర, బోధనలపై సీనియర్ వైష్ణవుల ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సాంస్కృతిక ప్రదర్శనలు, కీర్తనలు, మహాప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. 'ఎ గోల్డెన్ మైల్స్టోన్' పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో చివరి రోజు 50 ఏళ్లలో సేవామూర్తులకు సత్కారం, శోభయాత్ర, హైదరాబాద్ ఇస్కాన్ ప్రస్థానం, భవిష్యత్ విస్తరణపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ప్రతినిధులు వివరించారు. మొదటి రోజు కీర్తనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments